telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాహుబలికి తల్లినయ్యే అవకాశం దక్కింది… : హీరోయిన్ భాగ్యశ్రీ

Prabhas

ప్రభాస్‌ కథానాయకుడిగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయిక. యు.వి.క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలైంది. వినూత్న ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అలనాటి అగ్ర నాయిక భాగ్యశ్రీ ప్రధాన పాత్రలో నటించనుందని తెలుస్తున్నది. ప్రభాస్‌ తల్లిగా ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని అంటున్నారు. కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించడానికి భాగ్యశ్రీ సుముఖత వ్యక్తం చేసిందని తెలిసింది. ‘మైనే ప్యార్‌ కియా’ చిత్రంతో కథానాయికగా అరంగేట్రం చేసిన భాగ్యశ్రీ..అద్భుతమైన అందం, చక్కటి అభినయంతో అనతికాలంలోనే దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. తెలుగులో ఆమె బాలకృష్ణ సరసన ‘రాణా’ (1998) చిత్రంలో నటించింది. అయితే ఈ సినిమా గురించి భాగ్యశ్రీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘నన్ను ఇప్పటికీ ‘మైనే ప్యార్ కియా’ సినిమా హీరోయిన్‌గా ప్రజలు గుర్తుపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నటించబోతున్న సినిమాలో బాహుబలి ప్రభాస్‌కు తల్లినయ్యే అవకాశం దక్కింది. బాహుబలి సినిమా చూశాక ప్రభాస్‌ను చూసి నాకు నోట మాట రాలేదు. ప్రభాస్ పక్కన నటించడానికి ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి. ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ చూసి షాకయ్యాను. భూమి మీదే స్వర్గం ఉన్నట్లు అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు ఆడియన్స్ కూడా మైమరచిపోతారు. చాలా కాలం తర్వాత నాకు ఓ మంచి పాత్ర దక్కినందుకు సంతోషంగా ఉంది. ఇందులో నాది సాధారణ తల్లి పాత్రలా ఉండదు. సినిమాకు నా పాత్ర కీలకం అని చెప్పొచ్చు. ‘మైనే ప్యార్ కియా’ తర్వాత ప్రజలు నన్ను ఎంతగా గుర్తుపెట్టుకున్నారో ఈ సినిమా చూశాక కూడా అంతే బాగా గుర్తుండిపోతాను’ అని తెలిపారు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత భాగ్యశ్రీ నటించే తొలి తెలుగు సినిమా ఇదే అవుతుంది.

Related posts