శబరిమలలో అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టులో నేడు వాదనలు ముగిశాయి. పిటిషనర్ల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్లో పెట్టింది. ఇదిలా ఉండగా.. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ట్రావెన్కోర్ బోర్డు తాజాగా యూటర్న్ తీసుకోవడం గమనార్హం. ఈ విషయంలో సుప్రీం తీర్పును తాము పాటిస్తామని బోర్డు నేడు వెల్లడించింది.
పలు హిందూ సంఘాలతో పాటు ట్రావెన్ కోర్ బోర్డు కూడా గత తీర్పును వ్యతిరేకించింది. తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అనేక రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. తీర్పుపై ఎలాంటి పనఃసమీక్ష అవసరం లేదని కేరళ ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. ట్రావెన్ కోర్ బోర్డు కూడా ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును పాటిస్తామని బుధవారం న్యాయస్థానానికి వెల్లడించింది. శబరిమల వివాదం రెండు వర్గాల మధ్య సమస్య కాదని, ఒక మతానికి సంబంధించిన అంశమని బోర్డు ఈ సందర్భంగా పేర్కొంది.
ఐదుగురు న్యాయమూర్తులతో ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం ఎదుట పలువురు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలో జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, ఏఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్, ఇందు మల్హోత్రా ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.