బ్లేడ్ బ్యాచ్, చడ్డీ బ్యాచ్ .. లాంటి పేర్లతో నేరాలకు పాల్పడుతున్న వార్తలు ఇటీవల నగరాలలో బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. తాజాగా బ్లేడ్ బ్యాచ్ ఏపీలోని చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్ లో వీరంగం సృష్టించింది. రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులపై ఈ ముఠా సభ్యులు బ్లేడ్లతో ప్రయాణికులపై దాడికి ప్రయత్నించారు. అక్కడే విధుల్లో ఉన్న టీసీ ఉమామహేశ్వరరావు వీరిని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ప్రయాణికులను వదిలేసి టీసీపైనే ఈ బ్లేడ్ బ్యాచ్ దాడికి పాల్పడింది.
ఈ ఘటనలో గాయపడ్డ ఉమామహేశ్వరరావును అధికారులు ఆసుపత్రికి తరలించారు. విషయాన్నీ గుర్తించిన రైల్వే పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని బ్లేడ్ బ్యాచ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి పాల్పడింది తమిళనాడుకు చెందిన విజయన్, వెంకటేశ్ గా రైల్వే పోలీసులు గుర్తించారు. వీరిద్దరిపై కేసు నమోదుచేసిన పోలీసులు మరికాసేపట్లో కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. వీరికి గతంలో ఇలాంటి నేరచరిత్ర ఉందా? వీరు డ్రగ్స్ మత్తులో ఈ దాడికి తెగబడ్డారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.