రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నూతన ఉత్సాహంతో దూసుకుపోతోందని మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏపీ, తెలంగాణలకు త్వరలోనే బీజేపీ కొత్త అధ్యక్షులు రాబోతున్నారని చెప్పారు.
ఎవరు అధ్యక్షుడు అయినా అందరినీ కలుపుకొని ముందుకు వెళతామని విద్యాసాగర్ రావు చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు తమ పార్టీయే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. ఏపీలోనూ త్వరలో మార్పులు రాబోతున్నాయని తెలిపారు. సీఏఏతో ఎలాంటి ఇబ్బందులూ లేకున్నా రాజకీయ అవసరాల కోసం ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు దానిని వ్యతిరేకిస్తున్నాయని విద్యాసాగర్ రావు ఆరోపించారు.