ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన పోరాటం నేటితో 200 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా బీజేపీ నేత సుజనాచౌదరి స్పందించారు. అమరావతి ఉద్యమానికి బీజేపీ మద్దతు ఉంటుందని అన్నారు. అమరావతి విషయంలో కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందని వెల్లడించారు. అమరావతిపై రాజకీయ విద్వేషం చిమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు.
అమరావతి 29 గ్రామాల సమస్య కాదని, 13 జిల్లాల ప్రజల రాజధాని అని అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం లేదన్నారు. అమరావతి రైతుల ఉద్యమం విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.