రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మిత్రపక్షాలైన భాజపా-శివసేన మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్టే ఉంది. తాజా సమాచారం ప్రకారం భాజపా 144, శివసేన 126 సీట్లలో పోటీ చేసేలా సంధి కుదిరినట్లు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. మరో 18 సీట్లు చిన్న పార్టీలకు కేటాయించనున్నట్లు తెలిసింది. అంతేకాకుండా శివసేన నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు భాజపా సమ్మతించినట్లు సమాచారం. రాష్ట్రంలోని 288 స్థానాల్లో సగం సీట్లలో పోటీ చేయాలనే ప్రతిపాదనను తొలుత శివసేన భాజపా ముందుంచినట్లు తెలిసింది. కానీ దీనిపై ఓ వర్గం రాష్ట్ర భాజపా నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ విడిగా పోటీ చేయాలని ప్రతిపాదించారు.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మాత్రం శివసేనతో కలిసి పోటీ చేసేందుకే మొదటి నుంచి మొగ్గు చూపారు. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో గురువారం భాజపా-శివసేన నేతలు సమావేశమై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి ఫడణవీస్ సహా కోర్ కమిటీ సభ్యులు పంకజా ముండే తదితరులు హాజరయ్యారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు అక్టోబరు 21న జరగనున్నాయి. అదే నెల 24న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
బీసీలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపించారు: యనమల