ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉండాలని ఎంపీ, బీజేపీ నేత టీజీ వెంకటేశ్ సూచించారు. రాయలసీమ హక్కుల ఐక్యవేదిక సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేసే విధంగా ముందుకు పోవాలని తెలిపారు. తెలంగాణ కన్నా రాయలసీమ పూర్తిగా వెనకబడ్డ ప్రాంతమని అన్నారు. కళ్లముందు నీరున్నా తాగలేని పరిస్థితి సీమలో నెలకొందని పేర్కొన్నారు.
శ్రీశైలం ఒక స్టోరేజ్ ట్యాంక్లా మిగిలిన ప్రాంతాలకు మాత్రం ఉపయోగపడుతోందని అన్నారు.రాయలసీమ బాగుపడటం కోసం స్పెషల్ స్టేటస్తో పాటు స్పెషల్ ప్యాకేజీ కూడా అవసరమని ఆయన స్పష్టం చేశారు. లేకపోతే ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావడం కష్టమని అన్నారు. బీజేపీ రాయలసీమ అభివృద్ధికి డిక్లరేషన్ ఇచ్చిందని, సీమ అభివృద్ధి కోసం శాంతియుతంగా పోరాడే వారికి పూర్తి మద్దతిస్తామని తెలిపారు.