తెలంగాణలో టీఆర్ఎస్ పతనం ఖాయమని బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ బీజేపీ విస్తృతస్థాయి సమావేశం శనివారం హుజురాబాద్లో జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ సంజయ్ పాల్గొని మాట్లాడారు. పేదల సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. అక్రమాలకు పాల్పడిన టీఆర్ఎస్ నాయకుల్ని జైలుకి పంపుతామని అన్నారు.
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య, కొండగట్టు ప్రమాదం, నేరెళ్ల బాధితుల పాపం టీఆర్ఎస్కు తప్పక తగులుతుందని సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయంగా మారుతుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో పాలన స్తంభించిపోయిందని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.