ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత రాజకీయ స్వలాభం కోసమే కూటమి కడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి పేరుతో చంద్రబాబు దేశమంతా తిరుగుతూ ప్రజాధన్నాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కల్తీ కూటమిని ప్రజలు నిర్వీర్యం చేస్తారని జీవీఎల్ వ్యాఖ్యానించారు.
రాజకీయ ఎజెండా తప్ప అభివృద్ధి, విజన్ లేని రాజకీయ నాయకుడు చంద్రబాబని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను ఏపీతో పాటు తెలంగాణ కూడా నీరుగారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరికీ ఆరోగ్య రక్షణ కల్పించే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా పేరుతో చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని జీవీఎల్ ఆరోపించారు.