టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్లు బీజేపీ భావజాలంతోనే పనిచేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సూచించారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసుల నుంచి తప్పించుకుందామని బీజేపీలో చేరితే అంతకన్నా పొరపాటు మరోకటి ఉండదన్నారు. బీజేపీలో చేరినంత మాత్రాన వారి కేసులు మాఫీ కావని క్లారిటీ ఇచ్చారు. వారి కేసులకు సంబంధించి వారే సమాధానం చెప్పుకోవాలని అన్నారు.
పోలవరం ప్రాజెక్టులో చేపట్టిన రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వానికి డబ్బు ఆదా అవుతుందంటే ఆహ్వానించదగ్గ పరిణామమేనని కొనియాడారు. ఖర్చు తగ్గించి పోలవరం నిర్మిస్తామంటే కేంద్రానికి అభ్యంతరం లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. వంద రోజుల పాలనలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని చెప్పుకొచ్చారు. కార్పోరేట్లో పన్ను తగ్గింపుతో పెట్టుబడులు వస్తాయని అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహాయం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.