మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంగా బిజెపి నేత ప్రకాష్ మెహతాకు ఘట్కోపర్ నియోజకవర్గం నుండి టిక్కెట్ నిరాకరించడంతో ఆయన మద్దతుదారులు తమ పార్టీకే చెందిన అభ్యర్థిపై దాడికి దిగారు. ఈ స్థానం నుండి బరిలో వున్న బిజెపి అభ్యర్థి పరాగ్ షా కారును ధ్వంసం చేశారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. రాష్ట్రంలో 21న జరుగనున్న ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న పరాగ్ షా కారుపై మెహతా మద్దతుదారులు దాడికి పాల్పడి ధ్వంసం చేశారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
ఘట్కోపర్ (తూర్పు) నియోజక వర్గం నుండి 2014లో మెహతా గెలుపొందారు. మెహతా మద్దతుదారుల దాడిలో కారు కొంతమేర ధ్వంసమైందని ఆయన చెప్పారు. ఈ దాడిలో పరాగ్షాకు ఎటువంటి గాయాలు కాలేదు. తమ నాయకుడికి టిక్కెట్ నిరాకరించడానికి పరాగ్ షానే కారణమని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా మెహతా మద్దతుదారులు నినాదాలు చేశారు.