భాజపా నేతలు పార్టీ కార్యక్రమాలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఆయా కార్యక్రమాలకు హాజరవుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కనీస గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచందర్రావు సీపీకి ఫిర్యాదు చేశారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ… ఎంఐఎం చేసే కార్యక్రమాలకు పోలీసులు ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. ఉద్దేశ పూర్వకంగానే మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని అన్నారు. ఈ నెల 25వ తేదీన చార్మినార్ వద్ద ఎంఐఎం తలపెట్టిన ర్యాలీకి అనుమతి ఇవ్వొద్దని కమిషనర్ను కోరినట్లు వారు వివరించారు. మజ్లిస్ ర్యాలీకి అనుమతిస్తే వేరే చోట భాజపా కూడా ఆందోళన చేసే అవకాశముందని లక్ష్మణ్ హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో అల్లకల్లోలం సృష్టించాలని చూడటం మంచి సాంప్రదాయం కాదని నేతలు అభిప్రాయపడ్డారు.