ఒకప్పుడు ఢిల్లీ వెళ్లి మోదీ కాళ్లు మొక్కిన కేసీఆర్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని బీజేపీ నేత బాబుమోహన్ మండిపడ్డారు. అప్పుడు మంచివాడైన మోదీ ఇప్పుడు చెడ్డవాడు ఎలా అయ్యారని ప్రశ్నించారు. కేసీఆర్ తాను 17 సీట్లతో దేశాన్ని శాసిస్తానని అంటున్నారని, ఆయన కేవలం 17 సీట్లతోనే హవా సాగిస్తే దేశంలో మిగిలిన జాతీయ పార్టీలు ఏంచేయాలని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటువేయాలని, కేసీఆర్ చెబుతున్నదాంట్లో ఒక్కటీ వాస్తవంలేదన్నారు.
సర్జికల్ స్ట్రయిక్స్ లో ఎవరూ మృతి చెందలేదని కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని, కేంద్రం లక్షల కోట్ల నిధులు పంపిస్తే కేసీఆర్ లెక్క చెప్పకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. కొన్నిరోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు ఇచ్చిన తీర్పును అందరూ గమనించాలని, రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ శాసనసభ్యులే ఉంటే అభివృద్ధి ఎందుకు జరగడంలేదని బాబుమోహన్ నిలదీశారు.