వెటర్నరీ డాక్టర్ ప్రియాంక హత్య ఘటన దేశాన్ని కలవరపరిచిందని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. ప్రియాంక కుటుంబసభ్యులను లక్ష్మణ్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హత్య కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు.సభ్యసమాజం తలదించుకునే ఘటన జరగడం సిగ్గుచేటు అన్నారు. అమ్మాయిల కిడ్నాప్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వైద్యురాలి కుటుంబసభ్యులను పోలీసులు హేళన చేస్తూ మాట్లాడటం విచారకరమన్నారు. సకాలంలో స్పందిస్తే ఇంత దారుణ ఘటన జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. మంత్రుల వ్యాఖ్యల తీరు చూస్తే అసహ్యాంగా ఉందని వ్యాఖ్యానించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మంత్రుల వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూడడం బాధాకరమని తెలిపారు. పబ్, డ్రగ్ కల్చర్ హైదరాబాద్ను పట్టి పీడిస్తోందని చెప్పారు. న్యాయవాదులెవరూ నిందితుల తరపున వాదించవద్దని విజ్ఞప్తి చేశారు.