వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది కాకుండానే భూములు అమ్మకానికి పెట్టే పరిస్థితి వచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏడాదిలోనే ఏపీ ప్రభుత్వం దివాలా తీసిందా? అని నిన్న ఏపీ హైకోర్టు ప్రశ్నించిందని ఆయన గుర్తు చేశారు. ప్రజలపై సీఎం జగన్ అధిక ఛార్జీల భారం వేస్తున్నారని విమర్శించారు.
అనేక విషయాలపై కోర్టుల్లో వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని ఆయన ఎద్దేవాచేశారు. ప్రజలంటే వైసీపీ నాయకులకు గౌరవంలేదని, ప్రతిపక్షాలంటే అస్సలే లేదని ఆయన అన్నారు. ఆ పార్టీ నేతలు చట్టాలు, చట్టసభలపై కూడా గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆయన చెప్పారు. ఎన్నికల కమిషన్ కూడా వైసీపీ సొంత కార్యకర్తలా ఉండాలన్న ఉద్దేశంతో ఆ పార్టీ ఉందని విమర్శించారు.