తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు వార్తలు రాయించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు కూడా గడవకముందే గవర్నర్ పై కించపరిచే వ్యాసాలు రాయించారని మండిపడ్డారు. స్వయంగా సీఎం సీపీఆర్ఓ గవర్నర్ పై విషం కక్కేలా వార్తలు రాయించారని ఆయన ఆరోపించారు. వెంటనే సీపీఆర్ఓను ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయాలని, లేకుంటే క్రిమినల్ కేసు పెడతామని అన్నారు.
ప్రభుత్వ వేతనం తీసుకుంటూ రాజ్యాంగ బద్ధమైన పదవిని అవమానించేలా ఆయన ప్రవర్తించారని అన్నారు. గవర్నర్ ను కించపరిచేలా వ్యాసం రాసి, దాని చివరన “ఇది నా సొంత అభిప్రాయం” అని రాయించారని దుయ్యబట్టారు. గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు రాయించినందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని ఇంద్రసేనా రెడ్డి డిమాండ్ చేశారు.