బీజేపీ దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఒడిశాలో బీజేపీ ఏకంగా తన ఓట్ల శాతాన్ని అమాంతం పెంచేసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, అపర చాణక్యుడైన అమిత్షా వేసిన పాచికలతో ఏకంగా 73 శాతం తన ఓట్ల శాతాన్ని పెంచుకుంది. 2014 లో కేవలం రెండంటే రెండే సీట్లలో గెలిచిన బీజేపీ ఈసారి మాత్రం ఏకంగా 8 సీట్లకు ఎగబాకింది. గతంలో 21.9 శాతం ఓట్లను కైవసం చేసుకుంటే, ఈ దఫాలో ఏకంగా 38.4 ఓట్ల శాతాన్ని కైవసం చేసుకుని ప్రభంజనాన్ని సృష్టించింది.
ఒడిశాలో అధికార బీజేడీ ఓట్ల శాతం తగ్గింది. 2014 లో 44.8 శాతం కాగా, ఈ సారి మాత్రం 42.8 ఓట్ల శాతాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు సీట్ల సంఖ్య కూడా తగ్గింది. గతంలో 20 ఎంపీ సీట్లను గెలుచుకోగా, ఈసారి మాత్రం 12 సీట్లలో మాత్రమే జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. గతంలో 26.4 శాతంగా ఉంటే ఈసారి మాత్రం 13.8 శాతానికి పడిపోయింది.