ప్రత్యేకహోదా కోరినవారిని అరెస్ట్ చేయించిన చంద్రబాబు రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఢిల్లీలో దొంగ దీక్షలు చేస్తున్నారని బీజేపీ చీఫ్ అమిత్ షా విమర్శించారు. రాష్ట్రానికి ప్రధాని వచ్చినపుడు కనీసం గౌరవించాలన్న విజ్ఞతలేని చంద్రబాబు.. హద్దులు దాటి మోదీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి తామేమి చేశామో వివరిస్తూ సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు షా బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని చంద్రబాబు కోల్పోయారని అమిత్ షా అన్నారు. అందువల్లే వివిధ వర్గాలను ఆకర్షించేందుకుఅనేక పథకాలను ప్రకటిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించిన కాంగ్రెస్ పక్షాన ఇప్పుడు చంద్రబాబు చేరడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు మళ్లీ పట్టం కట్టాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా చంద్రబాబు రంగులు మారుస్తున్నారని షా విమర్శించారు. ఏపీ ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్లే కడప స్టీల్ ప్లాంట్ విషయంలో నిర్ణయం తీసుకోలేకపోయామని స్పష్టం చేశారు.