కరోనా వైరస్ కు వ్యాక్సిన్ సిద్ధమైతే ప్రపంచానికి అందించే సత్తా ఇండియాకే ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. కరోనాపై ఎన్నో దేశాల ఫార్మా కంపెనీలు, మెడికల్ వర్శిటీలు ప్రయోగాలు చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఇండియా ఫార్మా పరిశ్రమ కూడా ఎంతో శ్రమిస్తోందని అన్నారు. భారీ ఎత్తున వ్యాక్సిన్ ను తయారు చేయగల కెపాసిటీ ఇండియన్ కంపెనీలకు ఉందన్నారు. ఒకసారి వ్యాక్సిన్ బయటకు వస్తే, ఉత్పత్తి కోసం బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ కూడా కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
తాజాగా ‘కోవిడ్-19: ఇండియాస్ వార్ ఎగనెస్ట్ ది వైరస్’ అనే డాక్యుమెంటరీ కోసం ఆయన మాట్లాడారు. ఈ వైరస్ ఎన్నో సవాళ్లను ప్రపంచం ముందు ఉంచిందన్నారు. ఇండియాలోని జనసాంధ్రత కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. ఇండియా ఫార్మా రంగం ఎంతో శక్తిమంతమైనది. ఇక్కడి కంపెనీలు కేవలం భారత దేశానికే కాదు. ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్ ను పంపించగలవని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు.