అమెరికాలో కరోనా కేసులు రెండు లక్షలకు చేరిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్పందించారు. ఆయన ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పత్రికలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. దేశ వ్యాప్తంగా పది వారాల పాటు షట్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని, లేకుంటే తీవ్ర ఆర్థిక సంక్షోభం తప్పదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సూచించారు.
కరోనా వైరస్ విషయంలో ఎవరినీ నిందించకుండా, దేశవ్యాప్త షట్ డౌన్ ను అమలు చేయాలి. చాలా రాష్ట్రాల్లో బీచ్ లు ఇంకా తెరచుకునే ఉన్నాయి. రెస్టారెంట్లు పని చేస్తున్నాయి. ప్రజలు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నారు. వైరస్ కూడా అలాగే వ్యాపిస్తోంది. దీన్ని అడ్డుకోవాలంటే షట్ డౌన్ ఒక్కటే మార్గం” అని బిల్ గేట్స్ అన్నారు.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టేంత వరకూ షట్ డౌన్ చేయాలని, అప్పుడే ప్రజలను కాపాడుకోవచ్చని, కనీసం 10 వారాల పాటు దీన్ని అమలు చేయాలని అధ్యక్షుడు ట్రంప్ కు బిల్ గేట్స్ సలహా ఇచ్చారు. ఈ విషయంలో వెనుకంజ వేస్తే, అది ఆర్థిక బాధలను పెంచుతుందని ఆయన హెచ్చరించారు.