మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు భిలావల్ భుట్టో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై మండిపడ్డారు. ఇండియా-పాక్ ల మధ్య నెలకొన్న పరిస్థితులపై మాట్లాడుతూ, మొత్తం ప్రపంచానికే పాక్ ను శత్రు దేశంగా మార్చేశారని విమర్శించారు. ఈ క్రమంలో పాక్ తో అన్ని దేశాలు సంబంధాలను తెంచుకుంటున్నాయని చెప్పారు. ఇమ్రాన్ తీసుకుంటున్న చర్యల వల్లే ఇదంతా జరుగుతోందని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గంలోని ముగ్గురు మంత్రులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని భుట్టో ఆరోపించారు.
ఇరు దేశాల మధ్య ఎప్పటి నుంచో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ…ఈ మధ్య కాలంలోనే ఇవి ఎక్కువ ఎందుకయ్యాయని ప్రశ్నించారు. మీరు నిజంగా శాంతిని కోరుకుంటున్నట్టైతే… ప్రపంచ దేశాలు అడుగుతున్న ప్రశ్నలకు ముందు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాద నియంత్రణ పట్ల మీరు నిజాయతీగా ఉన్నట్లయితే… తాము చెప్పే మూడు విషయాలను సీరియస్ గా తీసుకోవాలని భుట్టో సూచించారు. ‘నిషేధిత సంస్థలకు మద్దతివ్వడాన్ని ఆపేయండి లేదా ఉగ్రవాదులకు దూరంగా ఉండండి. నేషనల్ సెక్యూరిటీ కమిటీని నియమించండి. మీ మంత్రివర్గంలో ఉండి, నిషేధిత సంస్థలతో బంధాలను కొనసాగిస్తున్న వారిపై విచారణ జరిపించి, చర్యలు తీసుకోండి’. ఈ మూడు చర్యలు తీసుకుంటే ఉగ్రవాద నియంత్రణకు పాక్ కృషి చేస్తోందనే విషయాన్ని అందరూ నమ్ముతారని చెప్పారు.
కశ్మీర్ ప్రజల సంబంధాలను భారత్ తెంచివేసింది: పాకిస్తాన్