భారీ వర్షాలతో ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. వర్షాలకు నదులు పొంగిపొర్లుతుండడంతో వరదలతో బీహార్ లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వరదలకు జనజీవనం అస్తవ్యస్తం కావడంతో ప్రజలు తినడానికి తిండి కూడా లేక అల్లాడిపోతున్నారు. కథీరా ప్రాంతంలో పరిస్థితి చూస్తే వారి కష్టాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. తమ నివాసాలు నీట మునగడంతో రహదారి వెంట గుడారాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
దిక్కు తోచని స్థితిలో వరద బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజల పరిస్థి ధీనంగా మారింది. ఏం చేయాలో తోచక రాత్రింభవళ్లు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ప్రభుత్వం నుంచి సాయం అరకొరగా ఉండడంతో, ఇక్కడివారు ఎలుకలను చంపి కాల్చుకుని తింటూ ఆకలి బాధ తీర్చుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోలు వైరల్ కావడంతో బీహార్ విపక్షాలు ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నాయి.