టీవీ షో లలోకెల్లా బాప్ అని పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో ప్రసారం అవుతున్న సంగతి అందరికి తెలిసిందే… గత రెండు సంవత్సరాలుగా ఘన విజయం సాధించిన టీవీ షో ప్రస్తుతం వివాదాలకు దారీ తీస్తుంది. మొత్తం 100 రోజుల పాటు 16 మంది సభ్యులు ఒకే ఇంటిలో ఉండి వారి జీవితంలో జరిగిన విషయాలను సాధారణ ప్రజలుగా ఒకరికొకరు తెలుసుకుంటారు. బిగ్ బాస్ షోలో నటించిన వారు టాస్క్ ల ఆధారంగా ఎలిమినేట్ అవుతూ… చివరకు ఒక్కరే విజేతగా నిలుస్తారు. ప్రస్తుతం ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్న బిగ్ బాస్ సిరిస్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు వివాదాలకు దారి తీస్తుంది. బిగ్బాస్ షో అంటేనే నచ్చదని చెప్పిన నాగార్జునను హోస్ట్గా తీసుకోవడం దగ్గర నుంచి పార్టిసిపెంట్స్ ఎంపిక వరకు ప్రతిదీ వివాదాస్పదంగా మారింది. నటి గాయత్రి గుప్తా, జర్నలిస్ట్ శ్వేతారెడ్డి బిగ్బాస్ నిర్వాహకులపై కాస్టింగ్ కౌచ్ కింద బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా బిగ్బాస్ షోను ఆపేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బిగ్బాస్ షోపై ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన గాయత్రి, శ్వేత తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఎఫ్ఐఆర్లో నమోదైన రవికాంత్, రఘు, అభిషేక్, శ్యాంకు ముందస్తు బెయిల్.. మంజూరు చేయొద్దంటూ కోర్టును ఆశ్రయించిన గాయత్రీ, శ్వేతారెడ్డి కోరారు. అంతకు ముందు మానవహక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయించారు. బిగ్బాస్ షోపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో బిగ్బాస్ కోఆర్టినేషన్ టీమ్ కూడా హైకోర్టును ఆశ్రయించింది. బంజారాహిల్స్, రాయదుర్గం పోలీస్ స్టేషన్లలో ‘బిగ్బాస్’పై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ షో నిర్వాహకులు క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. సినిమాలాగే బిగ్బాస్కు సంబంధించి ప్రతి ఎపిసోడ్నూ సెన్సార్ చేయాలని దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాత్రి 11 గంటల తర్వాతే షోను ప్రసారం చేయాలని ఆ పిటిషన్లో కేతిరెడ్డి పేర్కొన్నారు. హోస్ట్ నాగార్జునతో పాటు 10 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ కేతిరెడ్డి పిల్ను దాఖలు చేశారు.