బుల్లితెర బిగ్ రియాలిటీ షో సక్సెస్ ఫుల్గా పదివారాలు పూర్తి చేసుకొని పదకొండో వారంలోకి అడుగుపెట్టింది. గత వారం రవికృష్ణ బిగ్ బాస్ హౌజ్ని వీడగా, ప్రస్తుతం ఇంట్లో తొమ్మిదిమంది సభ్యులు ఉన్నారు. అయితే ఈ వారం ఇంటి సభ్యులు ఇమ్యూనిటీని పొందటం కోసం బాటిల్ ఆఫ్ మెడాలియన్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. వారం చివరిలో ఎవరో ఒకరికి మాత్రమే ఇది దక్కుతుందని అన్నారు. ఈ మెడల్ దక్కాలంటే తమలో పోటీ తత్వాన్ని నిరూపించుకోవలసి ఉంటుందని పేర్కొన్నారు బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ హౌజ్లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. అందరు కొత్త దుస్తులు ధరించి బతుకమ్మ పాటలు పాడుతూ పండుగని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం సోమవారం నామినేషన్ ప్రక్రియ కావడంతో ‘రాళ్లే రత్నాలు’ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో ఆకాశం నుండి 20, 50, 100, 200 విలువ కలిగిన రాళ్ల వర్షం కురుస్తోంది.. ఇంటి సభ్యులు ఆ రాళ్లను సొంతం చేసుకుని జమ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా ఎవరు ఎక్కువ విలువ కలిగిన రాళ్లను సొంతం చేసుకుంటే.. వాళ్లే ఈ వారం నామినేషన్స్ నుండి తప్పించుకుంటారు. తక్కువ ఉన్నవాళ్లు నామినేట్ అవుతారు.
శ్రీముఖి కెప్టెన్గా ఉన్న కారణంగా ఆమెకి టాస్క్లో మినహాయింపు ఇస్తూ సంచాలకురాలిగా వ్యవహరించాలని బిగ్ బాస్ తెలిపారు . టాస్క్ ప్రారంభమైన తర్వాత గేమ్ రంజుగా సాగింది. ఒకానొక సందర్భంలో రాహుల్తో గొడవపడ్డ మహేష్ తన దగ్గర ఉన్న రాళ్ళని విసిరేసి గేమ్ ఆడను అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు 200 విలువ లగ రాళ్ళని పునర్నవికి ఇచ్చి మళ్ళీ ఇవ్వమని కోరాడు. అందుకు ఆమె ఇవ్వనని చెప్పుకొచ్చింది. ఒకసారి ఇచ్చి మళ్ళీ అడిగితే ఎలా ఇస్తారు అని తెలిపింది. ఇందుకు మహేష్ .. కోపంలో ఇచ్చా. బుద్ది వచ్చింది అంటూ పునర్నవిని బ్రతిమిలాడాడు. అయినప్పటికి ఆమె మనసు కరగలేదు. సంపాదించిన మొత్తంతోనే ఏదైన కొనుక్కొని తినాలి కాబట్టి అందరు ఎక్కువ విలువ గల రాళ్లు పొందేందుకు కష్టపడ్డారు. అగ్గిపెట్టె రూ. 2000, ఉల్లిపాయలు 500, ఉప్పు రూ. 5000 ఇలా భారీ రేట్లకు అమ్మింది శ్రీముఖి. అయితే కేవలం ఉప్పు ,అగ్గిపెట్టె కొనుక్కుని జావతోనే సరిపెట్టుకున్నారు పోటీదారులు. మొత్తానికి తొలి రౌండ్ ముగిసే సమయానికి ఇంటి సభ్యుల్లో అందరికంటే తక్కువగా రాహుల్ సిప్లిగంజ్ దగ్గర ఉండటంతో అతను తొలిరౌండ్లో ఎలిమినేషన్కి నామినేట్ అయ్యాడు. ఇక వితికా, అలీ, శివజ్యోతిల దగ్గర ఎక్కువ డబ్బులు ఉండగా, నేటి ఎపిసోడ్లో మిగతావరు ఇంకెన్ని సంపాదిస్తారో చూడాలి.