ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా రక్తాన్ని సరఫరా చేస్తున్నామని నారా భువనేశ్వరి అన్నారు. తలసేమియా బాధితులకు రక్తం సరఫరా కోసం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మెమొరియల్ ట్రస్ట్ భవన్ లో ‘ట్రాన్స్ ఫ్యూజన్ కేర్ సెంటర్’ను భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చాలామంది చిన్నారులు నిరంతరం రక్తం సరఫరా అందక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులతో ఆమె కొద్దిసేపు ముచ్చటించారు. వ్యాధిగ్రస్తులైన చిన్నారులకు సాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకు వచ్చిందన్నారు. ఈ విషయంలో తాము గర్వపడుతున్నామని భువనేశ్వరి పేర్కొన్నారు. రక్తదాన శిబిరాల ద్వారా సేకరించిన రక్తంలో 30 శాతాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు అందజేస్తున్నామనీ, తద్వారా ప్రమాదాల్లో గాయపడేవారికి సత్వరం చికిత్స అందించడం వీలవుతుందని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియాతో బాధపడుతున్న 80 మందిని దత్తత తీసుకుందని ఆమె పేర్కొన్నారు.