ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఆ పార్టీ అధినేత సీఏం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో పది స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. మిగిలిన ఐదు స్థానాలను పెండింగ్లో పెట్టారు. మలి విడత జాబితాలో వాటిని ఖరారు చేసే అవకాశం ఉంది. భీమిలి విషయంలో చంద్రబాబు అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావు ఈ సారి అక్కడి నుంచి పోటీ చేయడం లేదని తేలిపోయింది.
భీమిలి నుంచే పోటీ చేస్తానని చెప్పిన గంటా తన సెంటిమెంట్కు ప్రాధాన్యం ఇచ్చి ఈసారి కూడా నియోజకవర్గం మారిపోయారు. విశాఖ నార్త్ (ఉత్తర నియోజకవర్గం) నుంచి పోటీ చేయడానికి టిక్కెట్ ఖరారు చేసుకున్నారు. దాంతో భీమిలికి కొత్త అభ్యర్థిని బరిలోకి దింపాల్సి వస్తుంది. భీమిలి అసెంబ్లీ స్థానానికి మునిసిపల్ మాజీ చైర్పర్సన్ గాడు చిన్నికుమారిలక్ష్మి పేరును తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యలయం నుంచి ఆమెకు ఫోన్ వచ్చిందని తెలుస్తోంది.