కరోనా టీకా విషయంలో భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసింది. ఇప్పటికే కరోనా టీకా కొవాగ్జిన్ను తయారుచేసిన భారత్ బయోటెక్ తాజాగా ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్(నాజల్ వ్యాక్సిన్) ను రూపొందించింది. ప్రపంచంలోనే తొలిసారి ముక్కుద్వారా వేసే కరోనా వ్యాక్సిన్ను రూపొందించిన ఘనత సాధించింది భారత్ బయోటెక్ సంస్థ. ఇప్పటికే దేశంలోని 4 ప్రధాన నగరాల్లో మొదటిదశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ఇప్పుడు మరో దశ క్లినికల్ ట్రయల్స్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు, మూడోదశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతించినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వెల్లడించింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక అవకాశం వ్యాక్సినేషన్ మాత్రమే. ముక్కుద్వారా ఇచ్చే వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు జంతువులపై చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. నాజల్ వ్యాక్సిన్తో భారత్ బయోటెక్ ఇప్పటికే 18 నుంచి 60 ఏళ్ల వారిపై తొలి దశ క్లినికల్ ట్రయల్స్ చేసింది. దీనికోసం గతేడాది సెప్టెంబరులో యూఎస్లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇన్ సెయింట్ లూయిస్తో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ముక్కు ద్వారా ఇచ్చే టీకా (బీబీవీ154- అడెనోవైరస్ వెక్టార్డ్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్)పై ఫోకస్ పెట్టింది.