ఫైనల్స్ లో దబాంగ్ దిల్లీని మట్టికరిపించి బంగాల్ వారియర్స్ తొలిసారిగా ప్రొ కబడ్డీ టైటిల్ను దక్కించుకుంది. శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఏడో సీజన్ పీకేఎల్ ఫైనల్లో దిల్లీని బంగాల్ 39-34 తేడాతో ఓడించింది. మ్యాచ్ మొదలైన ఎనిమిది నిమిషాల్లోపే బంగాల్ వారియర్స్ ఆలౌటైంది. తర్వాత బంగాల్ అద్భుతంగా పుంజుకొని విరామ సమయానికి 17-17తో స్కోరుని సమం చేసింది. రెండో అర్ధభాగంలోనూ బంగాల్ తన పరంపర కొనసాగించింది. 13 నిమిషాల్లోపు రెండు సార్లు దిల్లీని ఆలౌట్ చేసింది.
అనంతరం దిల్లీ కొద్దిసేపు ప్రతిఘటించినా లాభం లేకపోయింది. ఆఖర్లో దిల్లీ యువ రైడర్ నవీన్ కుమార్ పోరాడి 32-37తో జట్టును తిరిగి పోటీలోకి తీసుకువచ్చాడు. చివరికి 39-34 తేడాతో దిల్లీని ఓడించి బంగాల్ వారియర్స్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్లో 18 పాయింట్లు సాధించిన నవీన్ కుమార్ 300 పాయింట్ల మార్క్ను అందుకున్నాడు.