ప్రస్తుతం ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు అనేక మంది పలు రకాల పద్ధతులను పాటిస్తున్నారు. శీతల పానీయాలను తాగడం వాటిల్లో చాలా ముఖ్యమైంది. ఈ క్రమంలోనే చాలా మంది వేసవి తాపం నుంచి సేదదీరి శరీరాన్ని చల్లబరుచుకునేందుకు రక రకాల శీతల పానీయాలను తాగుతున్నారు. అయితే సహజసిద్ధంగా తయారు చేసుకునే బార్లీ నీటి పానీయం కూడా మనకు వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. మరి బార్లీ నీళ్లను ఎలా తయారు చేసుకోవాలో, వాటితో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం..!
ఒక లీటర్ మంచినీటిలో గుప్పెడు బార్లీ గింజలను వేయాలి. 20 నిమిషాలపాటు ఈ నీటిని బాగా మరిగించాలి. దీనితో బార్లీ గింజలు మెత్తగా మారి, వాటిలోని పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. తర్వాత ఆ నీటిని చల్లార్చి వడపోసి అందులో కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవాలి. ఈ నీటిని నిత్యం ఉదయాన్నే పరగడుపున తాగాలి. లేదా మధ్యాహ్నం ఎండకు బయటకు వెళ్లివచ్చిన వారు కూడా తాగవచ్చు. ఫ్రిజ్లో ఉంచి తాగితే శరీరానికి చల్లదనం కలుగుతుంది. అలాగే ఈ బార్లీ నీటిని తాగడం వల్ల మనకు ఇంకా అనేక లాభాలు కలుగుతాయి.
శరీరంలోని వ్యర్థ, విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. మూత్రాశయం శుభ్రంగా మారుతుంది. కిడ్నీ స్టోన్లు కరుగుతాయి. ముఖ్యంగా వేసవిలో మూత్ర సమస్యలతో బాధపడే వారికి బార్లీ నీళ్లు చక్కని ఔషధం అని చెప్పవచ్చు.
శరీరంలో ఉన్న వేడి బయటకు పోయి శరీరం చల్లగా మారుతుంది. అలాగే జీర్ణ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. విరేచనాలు అయిన వారు బార్లీ నీటిని తాగితే మంచిది.
బరువు తగ్గాలనుకునే వారు బార్లీ నీటిని తాగాలి. బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. వడదెబ్బ తాకకుండా ఉండాలన్నా, ఎండలో తిరిగి వచ్చిన వారు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలన్నా.. బార్లీ నీటిని తాగాలి.