తాజాగా డ్వాక్రా గ్రూపు వారికి పసుపు కుంకుమ కార్యక్రమం కింద చెక్కులు పంపిణి చేశారు. అంతవరకు బాగానే ఉన్నా, బ్యాంకులు కాళ్ళు అడ్డుపెట్టేశాయి. దీనితో చేతిదాకా వొచ్చింది, నోటికందకుండా పోయింది అన్నట్లు అయ్యింది పసుపు కుంకుమ మహిళల పరిస్థితి. చెక్కు చేతికందినా.. బ్యాంకు కరుణించకపోవడంతో.. ఎటూ తోచని పరిస్థితుల్లో మిగిలిపోయారు వింజమూరు డ్వాక్రా మహిళలు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో డ్వాక్రా మహిళలు సోమవారం ఆందోళన చేపట్టారు.
పాత బకాయిలతో సంబంధం లేకుండా పసుపు కుంకుమ నగదు ఇస్తామని స్థానిక ఎంఎల్ఎ చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన పసుపు కుంకుమ నగదు చెక్కులను తీసుకొని సదరు మహిళలు బ్యాంకుకు వెళ్లారు. అక్కడి బ్యాంకు సిబ్బంది డ్వాక్రా గ్రూపులో కొందరు నగదు చెల్లించలేదని, బ్యాంకు రూల్స్ ప్రకారం.. ఎంతో కొంత నగదు చెల్లిస్తేనే.. పసుపు కుంకుమ చెక్కులను మంజూరు చేస్తామని అన్నారు. దీంతో డ్వాక్రా మహిళలంతా బేజారయ్యారు. ఆగ్రహించిన డ్వాక్రా మహిళలు ఆందోళనకు దిగడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు.