అత్యవసరం అయితే తప్ప బ్యాంకుకు రావొద్దని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీవో) ఖాతాదారులకు విజ్ఞప్తి చేసింది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. వీలైనంత వరకు అన్ని సేవలు అందిస్తామని, ఈ విషయంలో వినియోగదారులు కూడా తమవైపు నుంచి సాయం చేయాలని కోరింది. ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్యలనే బ్యాంకు ఉద్యోగులు కూడా ఎదుర్కొంటున్నారని, కాబట్టి అత్యవసరం అనుకుంటే తప్ప బ్రాంచ్లకు రావొద్దని కోరింది.
మొబైల్, ఆన్లైన్ బ్యాకింగ్ చానల్స్ ద్వారా అందుబాటులో ఉన్న నాన్-ఎస్సెన్షియల్ సేవలను ఉపయోగించుకోవాలని, 24 గంటలూ ఆ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఐబీవో అధికారులు తెలిపారు. అవసరం అనుకుంటే బ్యాంకులకు ఫోన్ చేయొచ్చని తెలిపారు. నగదు జమ, ఉపసంహరణ, చెక్ క్లియరెన్స్, రెమిటెన్స్, ప్రభుత్వ పరమైన లావాదేవీలు వంటివి తప్పకుండా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.