గత సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన మొయిన్ అలీ.. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. అయితే ఈ ఐపీఎల్ సీజన్ కోసం కొత్తగా రూపొందించిన చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీపై ఉన్న ఓ మద్యం కంపెనీ లోగోను తన కోసం తీసేయాలని మొయిన్ అలీ టీమ్మేనేజ్మెంట్ కోరినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అందుకు సీఎస్కే యాజమాన్యం కూడా ఒప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తల నేపథ్యంలో మొయన్ అలీపై తస్లీమా నస్రీన్ అతనిపై తన అక్కసును వెళ్లగక్కింది. ‘మొయిన్ అలీ క్రికెట్లో స్టక్ కాకుంటే… కచ్చితంగా సిరియా వెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేవాడు’అని అభ్యంతరక రీతిలో ట్వీట్ చేసింది. దాంతో ఆమెపై యావత్ క్రికెట్లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తస్లీమా చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమంజసం కాదని మండిపడుతోంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా తస్లీమాను ఓ ఆట ఆడుకుంటున్నారు. అయితే ఇలా ఒకర్ని, ఓ వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం, ప్రజల ఆగ్రహానికి గురవ్వడం తస్లీమాకు కొత్తేం కాదు. గతంలో చాలా సార్లు ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడి ఆమె ఆ వర్గం నుంచి బెదిరింపులకు కూడా గురయ్యారు.