ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ బీజేపీ అభ్యర్థి గా సినీనటి జయప్రద పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా జయప్రదపై సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. . తాజాగా అజంఖాన్ కుమారుడు అబ్దుల్లా అజంఖాన్ కూడా జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. పాన్ దరేబా పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అబ్దుల్లా అజంఖాన్ మాట్లాడుతూ మాకు ‘అలీ, భజరంగబలీలు కావాలి కానీ, అనార్కలీ వద్దు’ అంటూ వ్యాఖ్యానించారు.
ఇప్పటికే జయప్రదపై అజంఖాన్ వివాదాస్పద కామెంట్స్ చేసి ఈసీ ఆగ్రహానికి గురయ్యారు. మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి లేదంటూ అజంఖాన్ పై ఈసీ నిషేదం విధించింది. దీంతో ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తండ్రికి బదులు ప్రచారంలో పాల్గొన్న కొడుకు అబ్దుల్లా జయప్రద పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.