భారత జట్టు 2020 చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్కు ఎంతో సమయం ఉన్నప్పటికీ మాజీ క్రీడాకారులు అప్పుడే దానిపై ఆసక్తి చూపుతున్నారు. సిరీస్ అత్యంత ఆసక్తికరంగా సాగుతుందనడంలో సందేహం లేదని దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా అంటున్నారు. కంగారూలతో భారత్ కచ్చితంగా గులాబి మ్యాచ్ ఆడుతుందని ధీమా వ్యక్తం చేశారు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ రాకతో పోటీ రసవత్తరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారత్, ఆస్ట్రేలియా తలపడే సిరీసేదైనా గొప్పదే. ఇదో సంప్రదాయంగా మారింది. అప్పుడే 2020 చివర్లో పర్యటనపై ఆసక్తి పెరిగిపోతోంది. స్మిత్, వార్నర్ వల్ల మా జట్టు మరింత బలపడింది. కోహ్లీసేన అన్ని విభాగాల్లో ప్రపంచంలోనే అగ్రగామి అనడంలో సందేహం లేదు. అందుకే ఈ సిరీస్ చిరకాలం గుర్తుండిపోతుంది. ఆస్ట్రేలియాలో గులాబి టెస్టు ఆడటం సవాలే. విరాట్ లాంటి ఆటగాడు దానిని స్వాగతిస్తాడు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టు ఏదైనా పరిస్థితులు, ప్రదేశంతో సంబంధం లేకుండా గెలవాలనే కోరుకుంటుంది. భారత్ అందుకు మినహాయింపేమీ కాదని స్టీవ్ వా అన్నారు.
రెండు జట్లు కఠినమైన క్రికెట్ ఆడుతున్నాయి. ఆస్ట్రేలియాకు ఉత్సాహకరమైన లైనప్ ఉంది. లబుషేన్ వంటి కొత్త ఆటగాళ్లు దొరికారు. స్మిత్, వార్నర్ బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత ఆసీస్ చాలా వేగంగా, బలంగా పుంజుకుంది. భారత్లో కోహ్లీసేనను ఓడించడం వారిలో ఆత్మవిశ్వాసం నింపింది. ఐసీసీ టోర్నీలు కైవసం చేసుకోవడం సులభం కాదు. భారత్కు వాటిని సాధించే సామర్థ్యం ఉంది. ఏ టోర్నీలోనైనా వారు గట్టి పోటీదారులు. భారత అభిమానులు సహనంతో ఉండాలి. మరో పెద్ద టోర్నీ గెలిచేందుకు టీమిండియాకు ఎక్కువ సమయం ఏమీ పట్టదు. నేను సంప్రదాయవాదిని. ఐదు రోజుల టెస్టులే నాకిష్టం. అవి ఆటగాళ్ల సామర్థ్యం, నైపుణ్యాలను అత్యుత్తమంగా పరీక్షిస్తాయి. టెస్టుల్లో మనం కొన్ని ఉత్కంఠకర, అద్భుతమైన మ్యాచుల్ని చూశాం. మరెందుకు మార్చడం? దాన్నలా వదిలేయండని స్టీవ్ వా పేర్కొన్నారు.