పల్లె పట్టణం తేడా లేకుండా వివిధ ప్రాంతాల్లో అనేక బ్యాంకుల ఏటీఎంలు దర్శనమిస్తాయి. కానీ ఇందులో చాలా ఏటీఎంలలో నో క్యాష్ అనే బోర్డులు కనబడుతుంటాయి. ఇలాంటి డబ్బులు లేని ఏటీఎంల పై ఆర్బీఐ దృష్టి సారించింది. ఇక నుంచి ఏటీఎంలు ఖాళీగా ఉంటే.. ఆయా బ్యాంకులకు జరిమానా విధించనున్నారు. నగదు డ్రా చేసుకునేందుకు ఏటీఎం మెషీన్ వద్దకు వెళ్లే కస్టమర్ల వెతలు తీర్చేందుకు ఆర్బీఐ ఈ కొత్త చర్యకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.
చిన్న చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో చాలా వరకు ఏటీఎంలు ఎప్పుడూ క్యాష్ లేకుండానే ఉంటున్నాయి. దీంతో ఆయా బ్యాంకుల కస్టమర్లు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. ఇటీవల ఆర్బీఐ ఏటీఎంల నిర్వహణపై ఓ కమిటీ వేసినట్లు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఏవైనా ఏటీఎంలలో 3 గంటల కన్నా ఎక్కువ సమయం నగదు లేకుండా ఉంటే వాటికి ఆర్బీఐ జరిమానా విధించనున్నట్టు తెలుస్తోంది.