ఈఎస్ఐ కేసులో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించామని అవినీతి నిరోధక శాఖ జేడీ రవికుమార్ తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశామని అన్నారు. అచ్చెన్నాయుడిని న్యాయమూర్తి ముందు హాజరుపర్చామని తెలిపారు. నేడు మరో ఐదుగురిని న్యాయమూర్తి ముందు హాజరుపర్చుతున్నామని వివరించారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటపడతాయని తెలిపారు. ఈఎస్ఐ కేసులో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించామని చెప్పారు.
హైకోర్టులో అచ్చెన్నాయుడితో పాటు రమేశ్ కుమార్ హౌస్ మోషన్ దాఖలు చేసినట్లు తమకు తెలిసిందని రవి కుమార్ తెలిపారు. తాము కూడా చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పారు. దాదాపు 150 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు వివరించారు. పలు అంశాల్లో ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు గుర్తించామని అన్నారు. ప్రభుత్వ అధికారులతో ప్రైవేటు వ్యక్తులు కుమ్మక్కై ప్రభుత్వానికి నష్టాన్ని తీసుకొచ్చారని ఆయన తెలిపారు.