అసోం మాజీ సీఎం తరుణ్ గొగొయ్ ఆరోగ్యం మరింత విషమించింది. ఇటీవల కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో నవంబర్ 2 నుంచి గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి ఆయనకు చికిత్స కొనసాగుతోంది. అయితే.. శనివారం రాత్రి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమాంత బిశ్వ శర్మ వెల్లడించారు. శనివారం రాత్రి నుంచే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని.. దీంతో ఆయనకు వైద్యులు వెంటిలేటర్ను అమర్చారని పేర్కొన్నారు. ఆయన పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నారని.. శరీరంలో చాలా అవయవాలు పనిచేయడం లేదని పేర్కొన్నారు. ఔషధాలు, ఇతర చికిత్స ద్వారా అవయవాలు పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తరుణ్ గొగొయ్ అస్సాంకు మూడుసార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో పాటు మాజీ సీఎం గొగొయ్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలను కూడా నిర్వర్తించారు.
previous post