ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎలాంటి భేదాభిప్రాయాలూ లేవని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. చంద్రబాబుపై తాను అలిగినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని స్పష్టంచేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తాను టీడీపీ కార్యకర్తనని, 1982 నుంచి పార్టీ సిద్ధాంతాల కోసం పని చేస్తున్నానని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ధర్మపోరాట దీక్షలోనూ ఆయనతో వెళ్లి రాష్ట్రపతిని కలిసిన విషయాన్ని గుర్తుచేశారు.
శుక్రవారం తాను విశాఖపట్నం వెళ్లడానికి ఢిల్లీలో విమానం ఎక్కుతుండగా పొలిట్బ్యూరో సమావేశ సమాచారం అందిందని, దానివల్లే అప్పటికప్పుడు ప్రయాణం మార్చుకోలేక హాజరు కాలేకపోయానన్నారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకీ తెలియజేశానని చెప్పారు.కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ పార్టీలోకి రావడం తనకిష్టం లేదన్నదీ అభూత కల్పనేనన్నారు. ఆయన మంచి వ్యక్తి అని, ఆయన టీడీపీలోకి రావడం స్వాగతించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు.