ఎన్నికల సంఘాన్ని కించపరుస్తూ కాంగ్రెస్ ప్రదర్శించిన ఓ కార్టూన్పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హద్దులు మీరి ప్రవర్తిస్తోందని ఓవైసీ నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఎన్నికలు నిర్వహించడంలో ఈసీ పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ ఓ బ్యానర్ను ప్రదర్శించారు.
కేంద్ర ఎన్నికల సంఘాన్ని ధృతరాష్ర్టుడితో, ఈఆర్వో, డీఈవో, సీఈవోలను దుశ్శాసనుడితో, ఓటర్లను ద్రౌపదితో పోల్చుతూ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇదే బ్యానర్లో సీఎం కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీ ఫోటోలను కూడా ఉంచారు. ఈ కార్టూన్పై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. రాహుల్ గాంధీ, నూతనంగా నియమితులైన జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీపై ఎవరైనా ఇలాంటి కార్టూన్లు వేస్తే ఎలా స్పందిస్తారు? అని ప్రశ్నించారు. ఘోరంగా ఓటమి పాలైన కాంగ్రెస్ ఇలాంటి కార్టూన్లకు తెరలేపిందని ఓవైసీ మండిపడ్డారు.