ఢిల్లీ ప్రాంత ప్రజలందరికి ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సేవలు ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఫ్రీ వైఫై సదుపాయాన్ని కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. ప్రతి వ్యక్తి నెలకు 15 జీబీ డేటాను ఉచితంగా పొందుతారని ఆయన చెప్పారు. నెట్ స్పీడ్ 200 ఎంబీపీఎస్ గా ఉంటుందని తెలిపారు.
తొలి విడతలో భాగంగా ఢిల్లీ వ్యాప్తంగా 11 వేల వైఫై హాట్ స్పాట్ లను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. తొలి విడతలో 11 వేల వైఫై హాట్ స్పాట్ లను ఏర్పాటు చేసేందుకు ఢిల్లీ కేబినెట్ ఆమోదముద్ర వేసిందని కేజ్రీవాల్ చెప్పారు. 3 నుంచి 4 నెలల్లో ఈ ఉచిత సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.