ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. హస్తిన పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా శతప్రయత్నాలు చేసినప్పటికీ కేజ్రీవాల్ క్రేజ్ ముందు బీజేపీ ఓటమి పాలైంది. 70 సీట్లకు గాను కేవలం 8 చోట్ల మాత్రమే గెలుపొందింది. 62 స్థానాలను గెలుచుకొన్న కేజ్రీవాల్ ఢిల్లీలో తమకు తిరుగు లేదని మరోసారి నిరూపించారు. ఈనెల 16న ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ మరోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
అయినప్పటికీ మిగిలిన ఎనిమిది చోట్ల ఓడిపోవడంపై కేజ్రీవాల్ దృష్టి సారించారు.ఎనిమిది స్థానాల్లో ఓటమిపాలు కావడంపై కేజ్రీవాల్ సమీక్ష నిర్వహించారు. కేజ్రీవాల్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఆప్ సీనియర్ నేతలంతా హాజరయ్యారు. ఈ సమావేశం సందర్భంగా పార్టీ నేతలకు కేజ్రీవాల్ పలు సూచనలు చేశారు. ఈ ఎనిమిది స్థానాల్లో పార్టీ నేతలంతా ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తూ, వారికి అందుబాటులో ఉండాలని ఆదేశించారు.