వింజమూరి అనసూయదేవి(99) అమెరికాలోని హ్యుస్టన్లో కన్నుమూశారు. ఆమె మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని. ఆమె దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనకోడలు. 1920 మే 12న కాకినాడలో ఆమె జన్మించారు. అనసూయా దేవికి ఐదుగురు సంతానం.
ఆంధ్రా వర్సిటీ నుంచి కళాప్రపూర్ణ, డాక్టరేట్ను వింజమూరి అందుకున్నారు. ఆలిండియా రేడియో ద్వారా తెలుగు జానపద గీతాలకు అనసూయదేవీ విశేషం ప్రాచుర్యం కల్పించారు. జానపద గేయాల సేకరణ, బాణీలు కట్టడంలో ఈమెది అందెవేసి చెయ్యిగా ప్రాచుర్యం పొందారు.
అనసూయాదేవి మృతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ అనసూయాదేవి దేశభక్తి గీతాలు, జానపదగీతాలాపనతో కళామతల్లికి సేవ చేశారని కొనియాడారు. అనసూయాదేవి సోదరి వింజమూరి సీతాదేవితో కలసి వేలాది గీతాలు ఆలపించారన్నారు. అనసూయాదేవి లేని లోటు తీర్చలేనిదని అన్నారు. వింజమూరి అనసూయ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపినట్లు చంద్రబాబు చెప్పారు.