ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్లో మరోమారు తెగబడ్డారు. ఆర్మీ జవాను ఇంటికెళ్లి మరీ ఆయనను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కాజీపొరా చడూరలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జమ్ముకశ్మీర్లోని లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన మహమ్మద్ యాసిన్ భట్ ఈ నెలాఖరు వరకు సెలవులో ఉన్నాడు.
ఈ క్రమంలో ఆయన ఇంటికి చేరుకున్న కొందరు వ్యక్తులు యాసిన్ను బలవంతంగా ఇంటి నుంచి తీసుకెళ్లినట్టు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యాసిన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తీసుకెళ్లింది ఉగ్రమూకలేమో అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు.