ఈ నెల 13 నుంచి 3 రోజులపాటు తిరుమలలో శ్రీ పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ 3 రోజులు స్వామి వారికి ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను నిలిపివేస్తున్నట్లు తితిదే బుధవారం తెలిపింది.
శ్రీవారి ఆలయంలో హుండీ కానుకలు కొన్నాళ్లుగా గుట్టలుగా పేరుకుపోయాయి. కానుకలను లెక్కించడంలో జరుగుతున్న జాప్యంపై భక్తులు, స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో తితిదే ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో అదనపు సిబ్బంది నియామకంతో పాటు పరకామణి పని వేళలను పెంచారు.
దీనితో ప్రస్తుతం చాలా వరకు కానుకల నిల్వలు తగ్గాయి. తిరుపతి పరకామణికి తరలించేందుకు నాణేల మూటలను ఉదయం బయటికి తీసుకొచ్చారు. ఎన్నడూలేనంతగా వందలాది బస్తాలను ఒకేసారి వెలుపలికి తీసుకురావడంతో కొంత సమయం పాటు శ్రీవారి భక్తులకు ఆలయ ప్రవేశం నిలిపివేశారు.