తెలంగాణ ప్రభుత్వం విదేశీ విద్యను అభ్యసించే వారికి ఉపకార వేతనం మంజూర్ చేయనుంది. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే పేద మైనార్టీ విద్యార్థుల (ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, పార్సీలు) కు ముఖ్యమంత్రి విదేశీ విద్యా పథకం కింద రూ.20 లక్షలు రెండు విడుతల్లో ఉపకార వేతనం మంజూరు చేయనుందని జిల్లా మైనార్టీ సంక్షేమ ఇన్చార్జి అధికారి డి.సుధాకర్ తెలిపారు. డిగ్రీ లేదా ఇంజినీరింగ్లో 60 శాతం మార్కులు పొంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయుటకు, పీజీలో 60 శాతం మార్కులు పొంది పీహెచ్డీ చేయాలనుకునే వారు మాత్రమే ఈపథకంలో ఉపకార వేతనం పొందుటకు అర్హులు అని అన్నారు.
ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే వారు ఆగస్టు 2018 నుంచి డిసెంబర్2018 లోపు ఎన్నిక చేయబడిన విదేశీ యునివర్సిటీల్లో ప్రవేశం పొంది ఉండాలన్నారు. ఉపకార వేతనం కోసం ఆన్లైన్లో www.telanganaepass.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పైన అర్హతలు ఉన్న విద్యార్థులు ఆన్లైన్ లో ఈనెల 20వ తేదీ సాయంత్రం 5గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.