ఏపీసీఎం జగన్ మధ్యంతర భృతిపై ఉద్యోగులకు హామీ ఇచ్చారు. 27 శాతం ఐఆర్ చెల్లించే విషయంపై మంత్రి మండలిలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగుల ముఖ్యమైన డిమాండ్ అయిన సీపీఎస్ను కూడా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు హామీలు ఇవ్వడంతో మాజీ సీఎంతో సన్నిహితంగా మెలిగిన ఉద్యోగుల అంశాన్నీ ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబుతో కొందరు ఉద్యోగులు సన్నిహితంగా ఉండి ఉండొచ్చని, పనులు చేయించుకునేందుకే అలా దగ్గరగా ఉండి ఉండొచ్చని జగన్ వ్యాఖ్యానించారు. అయినా గత అంశాలను తాను పట్టించుకోనని తెలిపారు. ప్రతి విభాగంలో సెక్రటరీ, హెచ్వోడీ దగ్గర పార్టీ మేనిఫెస్టో ఉండాలని చెప్పామన్నారు.
మేనిఫెస్టోలోని పనులన్నీ చేశామని చెప్పి మళ్లీ ఓట్లడిగే పరిస్థితి ఉండాలని వారితో చెప్పినట్లు జగన్ తెలిపారు. మేనిఫెస్టోలోని అంశాల్లో ఉద్యోగులకు సంబంధించిన అంశాలూ ఉన్నాయన్నారు. అందరం కలిస్తేనే సుపరిపాలన అందించడం సాధ్యమన్నారు. మధ్యంతర భృతి, సీపీఎస్ రద్దు వంటి అంశాలను కేబినెట్ భేటీ చర్చించి వాటిని ఎలా పూర్తి చేయాలన్న దానిపై కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అర్హత, అనుభవం చూసి ఒప్పంద ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకుంటామని తెలిపారు. ఇళ్ల స్థలాల విషయంలో ఉద్యోగులు భయపడాల్సిందేమీ లేదని హామీ ఇచ్చారు.
కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లించారు: యనమల