ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మళ్లీ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, 130 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నేతలతో గురువారం అర్ధరాత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. టీడీపీ గెలవబోతోందని, ఈ విషయంలో రెండో ఆలోచన అవసరం లేదని తేల్చి చెప్పారు. 130 స్థానాల్లో పక్కాగా గెలుస్తామని, ఈ సంఖ్య మరింత పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం లేదన్నారు.
చంద్రబాబు, ఫలితాలు వచ్చే వరకు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్ట్రాంగ్ రూముల వద్ద 40 రోజులు షిఫ్టుల వారీగా కాపు కాయాలని కార్యకర్తలు, నేతలకు సూచించారు. అర్ధరాత్రి వరకు పోలింగ్ విధులు నిర్వహించిన ఏజెంట్లకు అభినందనలు తెలిపారు. అర్ధరాత్రి 12 గంటలు దాటుతున్నా 200 బూత్లలో పోలింగ్ కొనసాగిందని, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు టీడీపీ వైపే నిలిచారన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు విధ్వంసాలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు.