ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు బంద్ ప్రారంభమైంది. బంద్కు కాంగ్రెస్, వైసీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలతో పాటు ఉద్యోగ ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల ఎదుట వామపక్షాలు ఆందోళనకు దిగాయి.
దీంతో ఈ ఉదయం నుంచి పార్టీల నిరసనలతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంబించి పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే లారీ ఓనర్స్ అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, విద్యాసంస్థలు బంద్కు సంఘీభావం తెలిపాయి. టీడీపీ కార్యకర్తలు ర్యాలీలు, నిరసన ప్రదర్శనల్లో నల్ల బ్యాడ్జీలతో పాల్గొంటున్నారు. బంద్కు ఏపీఎన్జీవో సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ డిపో ఎదుట ప్రత్యేక హోదా సాధన సమితి, కాంగ్రెస్, సీపీఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విభజన హామీలు అమలు చేయాలని ప్రధాని మోదీకి వ్యతిరేఖంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. .విజయవాడ బస్టాండ్ ఎదుట హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. బంద్ కు మద్దతు పలుకుతూ, నేడు సీఎం చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీలతో హాజరు కానున్నారు.