నేడు ఏపీ ఆరోగ్య శాఖామంత్రిగా నాని ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మారుస్తామని పేర్కొన్నారు. నేడు సచివాలయంలోని ఐదో బ్లాక్లోని తన ఛాంబర్లో వైద్య శాఖ మంత్రిగా నాని బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్యసేవ పథకాన్ని ‘వైఎస్సార్ ఆరోగ్య శ్రీ’ గా మారుస్తూ మంత్రి తొలి సంతకం చేశారు.
బాధ్యతలు స్వీకరించిన పిదప ఆయన మాట్లాడుతూ, టీడీపీ హయాంలో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి దయనీయంగా ఉండేదన్నారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వరుస శిశువుల మరణం దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్ తీరు ఇదే రకంగా ఉందని.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రజలు ఆనందంగా ఉండేవారని మంత్రి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం ఆరోగ్య శాఖకి విలువ ఇవ్వకుండా నిర్లక్ష్య ధోరణి అవలంబించారన్నారు. 108,104 వ్యవస్థలను బలోపేతం కోసం ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.