ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రక్తపోటు మరియు మధుమేహం ఉన్న రోగులకు ఉచిత మందులు పంపిణీకి సిద్ధమైంది. అంటే, ఇకపై రోగులు ప్రైవేటు మందుల దుకాణాల్లో బీపీ, షుగర్ ట్యాబ్లెట్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత మందుల పథకం అందుబాటులోకి తీసుకొచ్చింది. నెలకు సరిపడా మందులు ఒకేసారి పొందవచ్చు. రాష్ట్రంలో ఏ ప్రైవేటు రిటైల్ మెడికల్ షాపులోనైనా రోగులు ఈ మందులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. దీని కోసం విధి విధానాలను ఖరారు చేశారు.
1. వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
2. ఆ ఫలితాలను నిర్దేశించిన యాప్ లో అప్ లోడ్ చేయించుకోవాలి. దానికి సంబంధించి రోగి మొబైల్ కు కోడ్ వస్తుంది. అప్పుడే లబ్దిదారుడైనట్టు.
3. మెడికల్ దుకాణాలు కూడా నిర్దేశించిన యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడే ప్రభుత్వం ఆన్ లైన్ పేమెంట్ చేస్తుంది; అది దుకాణదారుడు ఖాతాలో జమ అవుతుంది.
మార్గదర్శకాలు వివరంగా :
ఈ మధ్య కాలంలో ఐసీఎంఆర్, కలామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీ సంస్థలు ఇటీవల ఏపీలో సర్వే నిర్వహించాయి. ప్రైవేటు వైద్యరంగంలో నెలకు రూ.వేలు వెచ్చించి బీపీ, షుగర్ మందులు కొనుగోలు చేసే రోగుల కుటుంబాల పై ఆర్ధిక భారం పడుతున్నట్లు గుర్తించారు. వారికి ఉచితంగా మందులు ఇవ్వడం ద్వారా ఆర్ధిక వెసులుబాటు కలుగుతుందని సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రభుత్వానికి పంపగా దీని పై అధ్యయనం చేసి న ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ముందుగా ఈ పధకం ద్వారా లబ్ది పొందాలనుకునే రోగులు తమ వ్యాధులను సమీపంలో ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో నిర్ధారణ చేయించుకోవాలి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, కమ్యూ నిటీ హెల్త్ సెంటర్లు, ప్రాంతీయ ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య బోధన ఆసుపత్రుల్లో డాక్టర్లు ఈ జబ్బులను నిర్ధారించాల్సి ఉంటుంది.
ఈ నిర్ధారణ పరీక్షలు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నెట్వర్క్ ఆసుపత్రుల వైద్యులు కూడా నిర్ధారించవచ్చు. బీపీ పరీక్షలతో పాటు గ్లైకోజినేటెడ్ హీమోగ్లోబిన్ పరీక్షలు (షుగర్కు) చేయించుకోవాలి. షుగర్ బాధితులు ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్ పరీక్షలతో వ్యాధిని నిర్ధారించాలి. అనంతరం డాక్టర్ రోగి పరీక్ష ఫలితాలను AP -e RX APP ద్వారా అప్లోడ్ చేస్తారు. వెంటనే రోగి సెల్ఫోన్ నంబర్కు ఎస్ఎంఎస్, కోడ్ వస్తుంది. అప్పుడే రోగి లబ్ధిదారుడుగా ఎంపికైనట్లు నిర్ధారణ అవుతుంది. ఈ కోడ్ను చూపి రిటైల్ మెడికల్ షాపునకు వెళ్లి మందులు తీసుకోవచ్చు. ఒకసారి నెలకు సరిపడా మందులు ఇస్తారు. రోగులను ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చేందుకు వారి ఆధార్ నంబర్, ప్రజా సాధికార సర్వే వివరాలను అనుసంధానం చేస్తారు. ప్రజా సాధికార సర్వేలో నమోదు కాని వారు తమ సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రం లో సంప్రదించాలని ప్రభుత్వం సూచిస్తోంది.
ఈ పథకం కింద రోగులకు మందులు విక్రయించాల్సిన రిటైల్ మెడికల్ దుకాణాల వారు మొదట అదే యాప్ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అనంతరం తాము విక్రయించే మందులను బిల్లు, రోగి కోడ్ నంబర్ను ఎంటర్ చేయాలి. ప్రభుత్వం వారానికి ఒకసారి మందుల దుకాణాలకు ఆన్లైన్ పేమెంట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎంఎస్డీఈసీ) బిల్లులను, చెల్లింపులను పర్యవేక్షిస్తుంది. రిటైల్ మందుల దుకాణదారులు ఈ మందులు విక్రయించేందుకు తొలుత యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందు కోసం ముందుగా దానిలో AP-eRX for pharmacy అని టైప్ చేయాలి. వెంటనే ఇన్స్టాల్ బటన్ వస్తుంది. దానిని క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయ్యి నెంబర్, పాస్వర్డ్ అడుగుతుంది. నంబర్, పాస్వర్డ్ ఇచ్చి రిజిస్టర్ అనే పదాన్ని క్లిక్ చేస్తే పూర్తి చేయాల్సిన దరఖాస్తు వస్తుంది. అక్కడ అడిగిన వివరాలు పూర్తి చేసిన తరువాత వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఈ నెంబర్ను ఎంటర్ చేసి సెండ్/ఓకే చేయాలి. వెంటనే రిటైల్ షాపు రిజిస్టర్ అవుతుంది. దీని ద్వారా రోగులకు ఈ పథకం కింద బీపీ, షుగర్ మందుల విక్రయాలు జరపవచ్చని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
ఆ బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది: యనమల